సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రేయసి రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో రియాను మూడు రోజుల నుండి ఎన్సిబి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా ఎన్సిబి అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో రియా అంగీకరించింది. అయితే తాను మాత్రం డ్రగ్స్ వాడలేదని, సుశాంత్ కోసమే కొనుగోలు చేశానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా, మొత్తం 25 మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను ఎన్సిబి విచారణలో బయటపెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా సుశాంత్ చుట్టూ ఉండే స్నేహితులు మొత్తం డ్రగ్స్ బాబులే అంటూ చెప్పింది. డ్రగ్స్ కేసులో ఆ 25 మంది బాలీవుడ్ స్టార్లకూ నోటీసులు ఇచ్చేందుకు ఎన్సిబి రంగం సిద్ధం చేసింది.
