లాక్‌డౌన్‌ ను ఉల్లంఘించిన ఇవాంక ట్రంప్

లాక్‌డౌన్‌ ను ఉల్లంఘించిన ఇవాంక ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్ నర్ లు లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ అమలులో ఉండగా, ఫెడరల్ నిబంధనలను అతిక్రమించి, వీరు సెలబ్రేషన్స్ కోసం వాషింగ్టన్ నుంచి న్యూజెర్సీ వెళ్లారు. వీరి ప్రయాణాన్ని వైట్ హౌస్ కూడా ఖరారు చేసింది. న్యూజెర్సీలోని బెడ్ మినిస్టర్ ప్రాంతంలో ట్రంప్ కు ఉన్న గోల్ఫ్ రిసార్టుకు వీరు వెళ్లారని, ఏప్రిల్ 8 నుంచి, 16 వరకూ జరిగే జ్యూయిష్ హాలిడే నిమిత్తం అక్కడకు వెళ్లారని వైట్ హౌస్ తెలిపింది. కాగా, ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో అనవసర ప్రయాణాలు చేయకుండా ప్రజలపై నిషేధం అమలులో ఉంది. కరోనా మహమ్మారి యూఎస్ లో ప్రబలిన నేపథ్యంలో, ట్రంప్ సర్కారు దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రేషన్స్ కోసం స్వయంగా ట్రంప్ కుమార్తె ప్రయాణం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక గత నెలాఖరులో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలంటూ వీడియో సందేశాన్ని ఇచ్చిన ఇవాంకా, ఇప్పుడు తనే వేడుకల్లో పాల్గొనడం ఏంటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.