ఆ వైద్యుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల పరిహారం

కరోనా పోరులో భాగంగా రోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తూ మహమ్మారికి బలైన 43 మంది వైద్యుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ. 25 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు బుధవారం తెలిపారు. అదేవిధంగా ఫ్రంట్‌ లైన్‌ కార్మికులకు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు గానూ ప్రోత్సహాకాలు ప్రకటించారు. అధికారిక ప్రకటన ప్రకారం ఏప్రిల్‌,మే, జూన్‌ నెలలకు గానూ వైద్యులకు రూ. 30 వేలు, నర్సులకు రూ. 20 వేలు, ఇతర కార్మికులకు రూ. 15 వేలు, అంతేకాకుండా పిజి విద్యార్థులు, ట్రైనీ వైద్యులకు రూ. 20 వేలను ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు.