ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలకు సంబంధించి పూర్తి జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొంత శాతం జీతాలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే మే నెలకు ఇవ్వాల్సిన జీతాలపై గురువారం అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ నెలకు ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతాలు అందుతాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.రాష్ట్ర ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయంతో తాము సంప్రదించామని, గత రెండు నెలలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జీతాలు 50 శాతం వాయిదా వేసినట్లు తెలిపారు. ఈరోజు(మే21) నుంచి పూర్తిస్థాయి ఉద్యోగులు హాజరవుతున్నారని, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. విధులకు హాజరయ్యే ఉద్యోగుల కోసం మాస్కులు, శానిటైజర్లను ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌లో ఉన్నవారిని ప్రత్యేక బస్సుల్లో రప్పిస్తామని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.