రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి కడసారి చూపుకోసం జనం బారులు తీరారు. సోమవారం ఉదయం హైదరాబాద్లో మరణించిన గౌతమ్రెడ్డి పార్థివదేహాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి నేవీహెలికాప్టర్లో నెల్లూరుకు తరలించారు. ఉదయం 11.15 గంటలకు నగరంలోని పోలీసు పెరెడ్ గ్రౌండ్కు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో డైకాస్ రోడ్డులోని మేకపాటి అతిథి గృహానికి తరలించి ప్రజల సందర్శనార్ధం అక్కడ ఉంచారు. పార్థివదేహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని రాజకీయపార్టీల నేతలు, కార్యకర్తలు బారులుతీరారు. ఒక్కసారిగా ఆయన అభిమానులు తీవ్ర ఉద్వేగానికిలోనై ‘జోహార్ గౌతమ్ అన్నా’..అంటూ నినదించారు.