కొలువు తీరిన ఖైరతాబాద్ గణేష్.. భక్తులకు అనుమతి లేదు

తెలంగాణలో వినాయక చవితి వేడుకలంటే అందరి దృష్టి ఖైరతాబాద్ గణపతిపైనే. ప్రతీ ఏటా ఇక్కడ అతి పెద్ద విగ్రహం కొలువు తీరుతోంది. ప్రతీ ఏటా వేలాది భక్తుల పూజలు అందుకుంటాడు ఇక్కడ బొజ్జ గణపయ్య. ఈసారి ఖైరతాబాద్‌లోని గణపయ్య ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనిమస్తున్నాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి విగ్రహం నిర్మాణాన్ని కేవలం 9 అడుగులకే పరిమితం చేశారు. కొవిడ్‌ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు.

పర్యావరణ హితంగా ఈసారి మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. 66వ సారి నిర్వహకులు ఖైరతాబాద్‌లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఈ ఏడాది గణేష్ విగ్రహం నిమజ్జనం కూడా అదే ప్రాంతంలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో భక్తులకు కూడా అనుమతి లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. చరిత్రలోనే తొలిసారిగా నిర్వహకులు చిన్న ప్రతిమను ఏర్పాటు చేశారు. 1970లో ఖైరతాబాద్‌లో 9 అడుగుల వినాయకుడ్ని ప్రతిష్ఠించారు. మళ్ళి 50 ఏళ్ళ తరువాత పరిస్థితుల కారణంగా 9 అడుగుల ఎత్తులో విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు నిర్వాహకులు.