కోవాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ షురూ!

దేశంలో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 10 లక్షల మార్క్‌ను దాటేసింది. ఈ క్రమంలో హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్‌ విజ్‌ శుక్రవారం కాస్త ఊరటనిచ్చే కబురు చెప్పారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ది చేసిన కరోనా విరుగుడు టీకా కోవాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ ఈ రోజు ప్రారంభమైనట్లు తెలిపారు. రోహతక్‌లోని పీజీఐ (పండిత్‌ భగవత్‌ దయాళ్‌ శర్మ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో ముగ్గురిపై టీకా ప్రయోగించగా.. వారంతా బాగానే ఉన్నారని.. ఎలాంటి ప్రతికూల ఫలితాలు, దుష్ప్రరిణామాలు చోటుచేసుకోలేదని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా కోవాక్సిన్‌ మానవ పరీక్షల మొదటి దశను ప్రారంభించినట్లు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఈనెల 15న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐసీఎంఆర్‌ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో ఈ మేరకు కోవ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే ఎయిమ్స్‌- పట్నాలో ఆస్పత్రి అధికారులు ఎంపిక చేసిన పది మంది వాలంటీర్లపై వ్యాక్సిన్‌ పరీక్షలు ప్రారంభించిన విషయం విదితమే.