గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిసిన ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ బుధవారం ఉదయం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ దాదాపు 45 నిమిషాల పాటు గవర్నర్‌తో చర్చించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎన్నికలకు పూర్తి స్థాయి సహకారం అందించేలా ప్రభుత్వాన్ని, ఉద్యోగులను గవర్నర్‌ ఆదేశించాలని కోరారు. వీటితో పాటు తాజాగా కొందరు అధికారులపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలను ఎస్‌ఈసీ గవర్నర్‌కు తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోన్న నేపథ్యంలో.. స్థానిక ఎన్నికల విషయంపై నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కాసేపట్లో ఎపి లోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లు, జిల్లా పరిషత్‌ సీఈవో లతో పాటు పలువురు అధికారులతో వర్చువల్‌ పద్ధతితో మాట్లాడనున్నారు. ఇందులో సీఎస్‌, డీజీపీ, వైద్య, ఆర్థిక, ఆరోగ్య, పంచాయతీరాజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొననున్నారు.