జగన్ కు చిరంజీవి విజ్ఞప్తి

సినిమా టికెట్ల అంశంలో పునరాలోచించాలని మెగాస్టార్‌ చిరంజీవి ఎపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అయితే అదే సమయంలో థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం టికెట్‌ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని అన్నారు. దేశమంతా జిఎస్‌టి పేరుతో ఒకే పన్నును విధిస్తున్నపుడు .. టికెట్‌ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసమని ట్వీట్‌ చేశారు. దయచేసి ఈ విషయంపై పునరాలోచించాలని, ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు సినీ పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందని చిరంజీవి పేర్కొన్నారు.