తెలంగాణాలో నిన్న ఒక్క రోజే 206 కేసులు

తెలంగాణాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. శనివారం భారీగా 206 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఇంత భారీగా కేసులు నమోదు కావడంతో భయాందోళన వ్యక్తమవుతోంది. కరోనా కారణంగా శనివారం ఒక్కరోజే 10 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన పాజటివ్‌ కేసుల్లో అత్యధికంగా 152 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లా లో 10, మేడ్చల్‌ జిల్లాలో 18, నిర్మల్, యాదాద్రి జిల్లాల్లో ఐదు చొప్పున నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 4, జగిత్యాల, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో 2 చొప్పున, వికారాబాద్, జనగామ, గద్వా ల, నల్లగొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా ల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. శనివారం నాటితో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,496 కు పెరిగింది. ఇప్పటివరకు 1,710 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,663 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 123కు చేరింది