తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. నేతలు అరెస్ట్‌..

తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు మంగళవారం ప్రారంభమైన నేపథ్యంలో.. జిహెచ్‌ఎంసి చట్ట సవరణను వ్యతిరేకిస్తూ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగాల భర్తీ కోసం అసెంబ్లీ ముట్టడికి బిజెపి, సిపిఐ, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపుచేసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రిజర్వేషన్లు ఖరారు చేయకుండా జిహెచ్‌ఎంసి ఎన్నికలను నిర్వహించకూడదంటూ బిజెపి నేతలు డిమాండ్‌ చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను అర్హులందరికీ ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్‌ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ సంఘాల నేతలు నినాదాలు చేశారు. వారంతా అసెంబ్లీ వద్దకు దూసుకురావడంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.