ప్రజా రవాణాపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పేర్ని నాని

ప్రజా రవాణాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర నిబంధనలు, రాష్ట్రంలో పరిస్థితుల అనుగుణంగా బస్సులు నడుపుతామని తెలిపారు.విజయవాడలో సోమవారం వైఎస్సార్‌ వాహనమిత్ర కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. వాహన మిత్ర పథకం ఇంటికొకరికి మాత్రమే వర్తిస్తుందని, రెండో ఏడాది పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఓనర్‌ కమ్‌ డ్రైవర్లకు రూ.10వేలు ఆర్థిక సాయం ఇస్తున్నామని తెలిపారు. గత ఏడాది 2,36,334 మందికి ఆర్ధిక సహాయం ఇచ్చామని, రెండవ ఏడాది పథకం జూన్ 4 తేదీన సీఎం జగన్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కొత్తగా అప్లయ్‌ చేసుకునేవాళ్లు ఈ నెల 18 నుంచి 26 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జూన్‌ 1వ తేదీలోపు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు. ఆర్టీసీలో ఒక్క ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని కూడా తొలగించలేదని మంత్రి స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారికి కోవిడ్ ఇన్సూరెన్స్ లేనందునే కొన్ని రోజులు విధులకు దూరంగా ఉంచామన్నారు. ఉద్యోగుల్ని ఎక్కడా తొలగించలేదని, తొలగించినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.