మల్టీస్టారర్‌ మూవీలో రజనీ, కమల్‌

దక్షిణ భారత చలనచిత్రంలో తమిళ స్టార్‌ రజనీకాంత్‌, యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో మల్లీస్టారర్‌ మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆశ నెరవేరబోతోంది. అవును, వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్‌ చిత్రంలో నటించబోతున్నారు. ఈ మేరకు దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ చేసిన వ్యాఖ్యలు నిజమనే తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ తీయబోతున్నట్లు చిత్రసీమలో వార్తలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే వీటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ప్రకటన చేశారు. బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలయిన ‘ఖైదీ, మాస్టర్‌’ తీసిన లోకేష్‌ కనకరాజ్‌ వీరిద్దరితో కలిసి మల్టీస్టారర్‌ తీస్తున్నట్లు ఇటీవల ఓ మీడియాతో ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో మేకర్స్‌ వెల్లడిస్తారని, అంతకు మించి ఈ చిత్రం గురించి మాట్లాడటం మరీ తొందరపాటు అవుతుందని చెప్పారు. కాగా, ఈ చిత్రాన్ని రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై కమల్‌ హాసన్‌ నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీ ‘అన్నాత్తే’ చిటిస్తుండగా, కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌2’ చిత్రంలో నటిస్తున్నారు.