మెట్రో రైల్లో పవన్‌ కళ్యాణ్‌ ప్రయాణం

వకీల్‌సాబ్‌ షూటింగ్‌ నిమిత్తం పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ మియాపూర్‌ వెళ్లాల్సి వచ్చింది. తదనుగుణంగా పవన్‌కళ్యాణ్‌ గురువారం రైల్వే స్టేషన్‌లో సాధారణ ప్రయాణికుడిలా చెకింగ్‌ ప్రక్రియ, ఎంట్రీ విధానాన్ని పాటించారు. మెట్రోరైలులో మియాపూర్‌ వరకు ప్రయాణించారు. ఆ ప్రయాణంలో తోటి ప్రయాణీకులతోనూ ముచ్చటించారు. పవన్‌కళ్యాణ్‌ పక్కనే ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాలవారు కూర్చున్నారు. అందులో ద్రాక్షారామానికి చెందిన చిన్న సత్యనారాయణ అనే రైతును పలకరించారు. పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. దానికి ఆయన స్పందిస్తూ వర్షాల కారణంగా వ్యవసాయం బాగా దెబ్బతిన్నదని ఆయనతో చెప్పారు. తమ కుటుంబలోనూ, ప్రాంతంలోనూ తనకు అభిమానులున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అని రైతు అనగా.. మీకే కాదు.. నాకూ ఇదే మొదటిసారి మెట్రోరైలులో ప్రయాణం అని నవ్వుతూ సమాధానమిచ్చారు. పవన్‌తోపాటు, చిత్ర నిర్మాత దిల్‌రాజు కూడా ప్రయాణించారు. ఈ ప్రయాణంలో భాగంగా అమీర్‌పేట స్టేషన్‌లో ట్రైన్‌ మారారు.