మోడీ సర్కార్ ఏకపక్షంగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై 15 గంటల పాటు రాజ్యసభలో చర్చించేందుకు కేంద్రానికి, ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదిరింది. ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని హస్తినాలో రైతులు చేపడుతున్న ఆందోళనలను రెండు నెలలకు పైగా కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం ఎగువసభ ప్రారంభం కాగానే రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ చర్చ జరుగుతుండగా.. రైతుల ఆందోళనపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో అసహనానికి గురైన చైర్మన్ వెంకయ్యనాయుడు ముగ్గురు ఆప్ ఆద్మీ పార్టీ ఎంపిలను సభ నుండి ఒక రోజు సస్పెండ్ చేశారు. అనంతరం ఈ అంశంపై కనీసం 5 గంటల పాటు సభలో ఏకధాటిగా చర్చ జరగాలని 15కు పైగా విపక్షాలు డిమాండ్ చేశాయి.