పవర్స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. ఆ తర్వాత అంతే పవర్ఫుల్గా వకీల్సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంతో దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన మళ్లీ వెండితెరపై కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమాలో పవర్స్టార్ అభిమానుల ఊహకు తగ్గట్టుగా …ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా ఉందా.. లేక నిరుత్సాహపరుస్తుందా అన్నది చూద్దామా..!
పల్లవి (నివేథా థామస్), జరీనా (అంజలి), దివ్య (అనన్య నాగళ్ల) ఈ ముగ్గురు అమ్మాయిలు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఒకే రూమ్లో కలిసి ఉంటారు. వీరిముగ్గురు ఓరోజు పార్టీకి వెళ్లి తిరిగొస్తుండగా.. కారు బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ సమయంలో వారు తెలిసిన కుర్రాళ్ల సాయం తీసుకుంటారు. అయితే వారు వారిపై లైంగిక దాడికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో దాడికి యత్నించిన వారిలో ఎంపి కొడుకు (వంశీకృష్ణ)ను పల్లవి గాయపరుస్తుంది. ఇలా ఆమె గాయపరచడంపై వంశీ ఆ ముగ్గురిపై పగ పెంచుకొని, ఇబ్బందులకు గురిచేస్తుంటారు. చివరకు ఆమెపై హత్యాయత్నం కేసు కూడా పెడతారు. దీంతో ఈ ముగ్గురమ్మాయిలూ చిక్కుల్లో పడతారు. మరలా తిరిగి అతనిపై కేసు తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రారు. అటువంటి సమయంలో గొప్ప లాయర్గా పేరొంది.. మధ్యలో ప్రాక్టీస్ ఆపేసిన సత్యదేవ్ (పవన్కళ్యాణ్) వారి పరిస్థితిని గమనించి… ఆ కేసును వాదించడానికి ముందుకొస్తారు. వీరి కోసం మళ్లీ నల్లకోటు తొడుగుతారు. ప్రతికూలాంశాలు ఎక్కువగా ఉన్న ఈ కేసు నుంచి ఈ ముగ్గురు అమ్మాయిలని ఎలా బయటపడేశారన్నదే మిగతా కథ.