శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా రెండు నెలలకు పైగా మూతపడ్డ తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి తెరుచుకోనుంది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌ రన్‌ నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ఈవో రాసిన లేఖకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దర్శనానికి అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్‌ మంగళవారం ఉత్వర్వులు జారీచేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను అనుసరిస్తూ శ్రీవారి దర్శనాన్ని కొనసాగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.