సినీ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటానని, తాను కూడా ఓ కార్మికుడినేనని కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి అన్నారు. ఇతర రంగ కార్మికులకు నిర్దిష్ట సమయం, ప్రదేశం, వాతావరణం ఉంటుందని, సినీ కార్మికులకు అలాంటివేమీ ఉండవని తెలిపారు. సినీ కార్మికులు ఎన్నో త్యాగాలు చేసి ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారన్నారు. మేడే సందర్భంగా తొలిసారిగా హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కరరెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిధిగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి హాజరయ్యారు. అతిధులుగా చిరంజీవి, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎపి సినిమాటోగ్రఫీ మంత్రి గోపాలకృష్ణ, సిఎల్పి నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు.