సిబిఐ దాడులు చట్టవిరుద్ధమంటూ స్పీకర్‌కు కార్తి చిదంబరం లేఖ

వీసా కుంభకోణం కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ ఎంపి కార్తి చిదంబరం శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటరీ ప్రత్యేక హక్కుని సిబిఐ అధికారులు స్పష్టంగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఒకదాని తర్వాత మరొకటి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ సమస్య పార్లమెంట్‌ సభ్యునిగా తన హక్కులు, అధికారాలకు సంబంధించినదని, ఈ అత్యవసరమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి బాధపడుతున్నానని లేఖలో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా తన కుటుంబం, తాను కేంద్రానికి లక్ష్యంగా మారామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎడతెగని ప్రచారం చేస్తూ.. ఒకదాని తర్వాత మరొకటి తప్పుడు కేసులు బనాయించి, అసమ్మతి గొంతుకలను అణచివేసేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు.