కరోనా వైరస్పై పోరాటంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ను పాటిస్తున్నారు. దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే, ఇళ్లలో ఖాళీగా కూర్చున్న తెలుగు సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా టాలీవుడ్ స్టార్స్ ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా పలకరిస్తున్నారు. వాళ్లతో ముచ్చటిస్తున్నారు. ‘మనందరి కోసం’ అనే స్లోగన్తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ఈ లైవ్లు ప్రారంభమయ్యాయి.
ఉదయం 7 గంటలకు మంచు లక్ష్మితో మొదలైన ఈ ఇన్స్టాగ్రామ్ లైవ్.. రాత్రి 8.30 గంటలకు రానా దగ్గుబాటితో ముగుస్తుంది. మొత్తం 28 మంది టాలీవుడ్ స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరిలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, మంచు మనోజ్, అల్లరి నరేష్, అనసూయ, సుధీర్ బాబు, కార్తికేయ వంటి స్టార్లు లైవ్లో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇన్స్టాగ్రామ్ యాప్లో ఈ లైవ్ను వీక్షించొచ్చు. స్టార్లను మీరు ప్రశ్నలు అడగవచ్చు. అయితే, మొత్తం 28 మంది సెలబ్రిటీల్లో 26 మంది పేర్లు మాత్రమే వెల్లడించారు. మిగిలిన ఇద్దరు సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎవరు ఏ సమయంలో లైవ్ ఇస్తున్నారో మంచు లక్ష్మి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు.