6 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరింత పకడ్బందీగా రేషన్‌ కార్డులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి కొత్త దరఖాస్తులకు రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల ఎక్స్‌అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఐదు రోజుల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు.రేషన్ డోర్ డెలివరీలో భాగంగా కార్డుదారులకు బియ్యం సంచుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి 10,15 కిలోల చొప్పున సంచులను అందిస్తామన్నారు.ఒక్కో సంచీ తయారీకి రూ.25 ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు కోన శశిధర్‌ తెలిపారు.