తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణలేని బిజెపి అక్కడ పాగా వేసేందుకు సినీ ప్రముఖులకు గాలం వేస్తోంది. అందులో భాగంగా తెలుగు సినీ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్కు రాజ్యసభ అవకాశమిచ్చింది. తాజాగా అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న జూనియర్ ఎన్టిఆర్ను ప్రత్యేకంగా పిలిపించుకుని అమిత్ షా సమావేశం కావడం తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ రాజకీయాల్లో కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రాత్రి 10.20 గంటలకు నోవాటెల్ హోటల్కి వచ్చిన అమిత్ షా… జూ.ఎన్టిఆర్ కోసం అరగంట సేపు వేచి చూశారు. జూ.ఎన్టిఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికి హోటల్లోకి తీసుకెళ్లారు. జూ.ఎన్టిఆర్తో కలిసి డిన్నర్ చేసిన అమిత్ షా సుమారు 20 నిమిషాలు ఏకాంత చర్చలు జరిపారు. ట్రిబుల్ ఆర్ సినిమా ఇటీవల చూశానని, కొమురం భీం పాత్ర తనను ఎంతో ఆకట్టుకుందని జూ.ఎన్టిఆర్ను అమిత్ షా అభినందించారు.