రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

రాజధాని తరలింపులో వైసీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో 79.91 కిలో మీటర్లు మేర లైట్ మెట్రో రైలు కారిడార్‌ను 60 కిలో మీటర్ల మేర ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు ఏర్పాటు చేసింది.

డీపీఆర్‌ల రూపకల్పనకు కొటేషన్లు పిలిచింది. ప్రతిపాదిత 79.91 కిలోమీటర్ల విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు 60 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులన్నీ ఇక ఈ ప్రాంతీయ కార్యాలయం నుంచే కొనసాగనున్నాయి.

రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో అమరావతి ప్రాంత రైతులు గత మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కోర్టులను సైతం ఆశ్రయించారు. అయితే మూడు రాజధానుల నిర్ణయానికే పూర్తిగా కట్టుబడ్డ వైసీపీ ప్రభుత్వం.. దీన్ని అమలు చేసేందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది. జ్యుడీషియల్ రాజధాని కర్నూలుకు పలు విభాగాలను ఇప్పటికే తరలించిన ప్రభుత్వం.. పరిపాలనా రాజధాని విశాఖకు సైతం పలు పలు విభాగాలను తరలించేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖ తరలించేందుకు నిర్ణయించింది.