తెలంగాణలో సింగరేణి చిచ్చు .. పొలిటికల్గా అంతకంతకూ అగ్గిరాజేస్తోంది. సింగరేణిలో బొగ్గుగనుల వేలాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్.. యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఈ క్రమంలోనే.. సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, బొగ్గు గని కార్మిక సంఘం నేతలతో సమావేశమైన కేటీఆర్.. మరోసారి ఉద్యమించి సింగరేణిని కాపాడుకుంటామని చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కు అయి వాళ్లకు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని… దీనిని అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చారు. కేటీఆర్తో భేటీ అనంతరం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది బొగ్గుగని కార్మిక సంఘం. జూలై 1 నుంచి 9న వరకు నిరసనలు.. భారీధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రెండవ దశలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. పార్లమెంట్ సమావేశాల వేళ డిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయాలని ప్లాన్ చేస్తోంది.