కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఫోన్లు తీసుకున్న అనంతరం.. అనాథ పిల్లలు ఏదైనా సాయం కోసం అధికారులను సంప్రదించవచ్చు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే కోవిడ్ బారినపడి తల్లిదండ్రులు మరణించడంతో 85 మంది పిల్లలు అనాథలయ్యారు. దీంతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన అనాథలు సైతం ఉన్నారని అధికారులు తెలిపారు. మొత్తం 138 మంది అనాథ పిల్లలున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. అనాథ పిల్లల భద్రత దృష్ట్యా వారి సమస్యలను అధికారులు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అనాథ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అందించాలని మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంది. ఈ ఫోన్లలో జిల్లా శిశు సంరక్షణ శాఖ అధికారితోపాటు పలువురు అధికారుల ఫోన్ నంబర్లు, హెల్ప్ లైన్, ఎమర్జెన్సీ నెంబర్లను కాంటాక్ట్ జాబితాలో ఫీడ్ చేసి.. అనాథ పిల్లలకు అందించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు వెల్లడించారు.