ప్రకాశం జిల్లా రైతాంగం కల్పతరువు వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు ఏపీ సీఎం జగన్ వస్తున్నారు. కరువు జిల్లా దాహం తీర్చేందుకు అప్పటి సీఎం వైఎస్ చేసిన ప్రయత్నానికి ముగింపు పలికేందుకు కంకణం కట్టుకున్న జగన్ అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పనులను పరిశీలించడంతో పాటు యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తారు. దీంతో ఇన్నాళ్లకైనా ప్రాజెక్టు పూర్తవుతుందనే ఆశ జిల్లా రైతాంగంలో నెలకొంది.
కరువు జిల్లాగా పేరుగాంచిన ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో నిర్మితమవుతున్న వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనకు సీఎం జగన్ ఇవాళ రానున్నారు. ఉదయం 10 గంటలా 30 నిమిషాలకు వెలిగొండ ప్రాజెక్టు దగ్గరకు చేరుకోనున్న జగన్ ముందుగా టన్నెల్ 2 లోని పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత 11 గంటల సమయంలో టన్నెల్ వన్ పనులను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత 11 గంటలా 30 నిమిషాలకు ప్రాజెక్టు పనుల పై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు.