మోదీకి మమతా బెనర్జీ దిమ్మదిరిగే కౌంటర్

మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. యాస్ తుఫాను నష్టంపై ప్రధానితో సమీక్ష సమావేశానికి బెంగాల్ సీఎం అలస్యంగా వచ్చారని, ప్రధానిని కించపరిచేలా, అమర్యాదగా ఓ ముఖ్యమంత్రి ప్రవర్తించడం గతంలో ఎన్నడూ చూడలేదని ప్రధాన మంత్రి కార్యాలయం చేసిన వ్యాఖ్యలపై దీదీ మండిపడ్దారు. మీడియాకు పీఎంఓ తప్పుడు సమాచారం ఇస్తోందని దుయ్యబట్టారు. మమ్మల్ని ఇంతలా అవమానించవద్దని, అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఘన విజయం సాధించడంతో మీరు ఓర్వలేకపోతున్నారని మమతా తూర్పారబట్టారు.

‘‘ఈ విధంగా నన్ను అవమానించవద్దు.. మాకు ఘన విజయం లభించింది, అందుకే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? గెలవడానికి మీరు ప్రతి ప్రయత్నం చేసి ఓడిపోయారు. ప్రతిరోజూ మాతో ఎందుకు గొడవ పడుతున్నారు’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని బెంగాల్ సీఎం నిలదీశారు. ‘‘తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి ముందే సిద్ధమయ్యాం.. సాగర్, దిఘాలో తుఫాను నష్టాన్ని అంచనా వేయాలని భావించాం.. దీనికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం… అకస్మాత్తుగా ప్రధాని ఫోన్ చేసి బెంగాల్‌లో పర్యటిస్తున్నట్టు చెప్పారు’’ అని మమతా పేర్కొన్నారు.