టీఆర్ఎస్కు చెందిన కొందరు ముఖ్య నేతలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. మూడేళ్ల క్రితం వారు చేపట్టిన గులాబీ కూలీ కార్యక్రమానికి సంబంధించి వివరాలు, లెక్కలు చెప్పాలంటూ ఐటీశాఖ ఇప్పుడు తాఖీదులిచ్చినట్లు తెలుస్తోంది. ఐటీశాఖ కన్ను పడిన వారిలో కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. కేటీఆర్, హరీశ్ రావు, మహమూద్ అలీ, ఈటల రాజేందర్ సహా ఈ జాబితాలో చాలా మంది పేర్లు ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది.
మూడేళ్ల క్రితం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ వరంగల్లో పెద్ద ఎత్తున ప్రగతి నివేదన సభ నిర్వహించింది. అయితే అప్పుడు ఈ సభకు వచ్చే కార్యకర్తల దారి ఖర్చుల కోసం వినూత్నంగా ‘గులాబీ కూలీ’ పేరిట టీఆర్ఎస్ ఓ కార్యక్రమం చేపట్టింది. అగ్ర నేతల పిలుపు మేరకు అప్పటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ముఖ్యనేతలు కూలీ పనులు చేసి.. నిమిషాల వ్యవధిలోనే రూ.లక్షలు సంపాదించారు. ఈ పరిణామానికి సంబంధించే తాజాగా ఐటీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.