రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్లపై పేర్ని నాని కౌంటర్‌ ఎటాక్‌

ఎపిలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వరుసట్వీట్లతో పాటు ‘ప్రభుత్వానికి పది ప్రశ్నలు’ పేరుతో ఒక వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్లపై ఎపి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు.- రూ.100 టికెట్‌ను రూ.1000, రూ.2000కు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్‌ మెకానిజం అంటారు? డిమాండ్‌, సప్లరు అంటారా? లేక బ్లాక్‌ మార్కెటింగ్‌ అంటారా?
– గత 66 సంవత్సరాలుగా చట్టాలకు లోబడే ప్రభుత్వాలు ధర నిర్ణయిస్తున్నాయి. కానీ, ఇప్పుడు సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి ఉండకూడదనే ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది.- నిత్యావసరాల ధరల్నే ప్రభుత్వం నియంత్రించవచ్చని.. సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని మీరు ప్రశ్నించారు. సినిమా థియేటర్లు ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు.- బలవంతంగా ధరలు తగ్గిస్తే ప్రోత్సాహం తగ్గుతుందన్నారు. ప్రోత్సాహం తగ్గేదెవరికి.. కొనేవారికా? లేక అమ్మేవారికా? నిర్మాతల శ్రేయస్సు తప్ప ప్రేక్షకుల గురించి ఆలోచించరా?
– వైద్యం, విద్య మాదిరిగా రాయితీని ప్రభుత్వం భరించాలన్నారు. సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా గానీ మేం భావించడం లేదు.