విశాఖలో భయానక పరిస్థితులు.. గ్యాస్ లీక్ ఘటన ఎలా జరిగిందంటే!

విశాఖలో భయానక పరిస్థితులు.. గ్యాస్ లీక్ ఘటన ఎలా జరిగిందంటే!

విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ గ్యాస్ లీక్ ఘటన తీవ్ర కలకలంరేపుతోంది. ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామంతో పాటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనాలు రోడ్లపై పడిపోయారు.. చాలామంది ఇళ్లలో చిక్కుకుపోయారు. ఎక్కడ చూసినా జనాలు ఊపిరి అందక ఇబ్బందులు పడుతూ కనిపించారు. తెల్లవారుజామున ఒక్కసారిగా విష వాయువు పరిశ్రమ నుంచి లీకైనట్లు తెలుస్తోంది. గ్యాస్ దెబ్బకు ఊపిరాడక జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

పరిశ్రమకు చుట్టు పక్కల గ్రామాల్లో ప్రజలు కొంతమంది రోడ్లపైకి వచ్చి పడిపోయారు.. వెంటనే స్థానిక యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి గ్రామాల్లోని వీధుల్లో మహిళలు, చిన్నారులు రోడ్లపై పడిపోయి ఉన్నారు. చాలామంది ఇళ్లోనే తలుపులు వేసుకుని ఉండిపోయారు. గ్యాస్ దెబ్బకు బయటకు రాలేకపోయారు.. పోలీసులు, యువత తలుపులు పగులగొట్టి కేజీహెచ్‌కు తరలించారు. పరిశ్రమలో గ్యాస్ లీక్ అదుపులోకి తీసుకొచ్చినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నా.. ఆ ప్రభావం ఇంకా కనిపిస్తోంది. అక్కడ బాధితుల్ని తరలించడానికి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్, పోలీసులు కూడా అస్వస్థతకు గురయ్యారంటే పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 2వేలకు మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారని అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. గ్యాస్ లీక్ కావడంతో ప్రాణ భయంతో పరుగులు తీస్తూ ఓ వృద్ధుడు బావిలో పడిపోయి చనిపోయాడు. మరో వృద్ధుడు, ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయారు. కేజీహెచ్‌లో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వారిందరికి వైద్యం అందిస్తున్నామని.. అస్తమా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారికిపై ప్రభావం ఎక్కువగా ఉందంటున్నారు. పరిశ్రమలో నుంచి లీకైన వాయువు అత్యంత ప్రమాదం అంటున్నారు.