కరోనాపై తెలంగాణ కీలక నిర్ణయం

కరోనా వ్యాప్తి నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌ గడువు 14 రోజులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ 14 రోజుల సమయం నుంచి తాజాగా 28 రోజులకు పెంచారు. కొంత మందికి కరోనా వైరస్‌ సోకిన లక్షణాలు 28 రోజుల వరకు బయటపడడం లేదని గ్రహించిన అధికారులు హోం క్వారంటైన్ గడువును పెంచాలని ప్రతిపాదించడంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై హోం క్వారంటైన్‌లో ఉన్నవారు 14 రోజులు కాకుండా 28 రోజులు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, కరోనా టెస్టుల విషయంలోనూ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. కేవలం ప్రైమరీ కాంటాక్టులకే కరోనా పరీక్షలు చేయాలని.. సెకండరీ కాంటాక్టులను కరోనా పరీక్షలు చేయవద్దని అధికారులకు మార్గదర్శకాలు రూపొందించారు.

మరోవైపు, తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. హైదరాబాద్‌లో అత్యధిక కేసులు నమోదు అవుతుండగా, సూర్యాపేట ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 83కు చేరుకుంది. ఆ తర్వాతి స్థానంలో నిజామాబాద్ ఉంది. మంగళవారం ఒక్క సూర్యాపేటలోనే 26 కేసులు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ సూర్యాపేటపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉదయం సూర్యాపేటలో పర్యటించారు. సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు మార్గనిర్దేశనం చేశారు.