టీఆర్ఎస్ 20 ఏళ్ల ప్రస్థానం..

టీఆర్ఎస్ 20 ఏళ్ల ప్రస్థానం..

చాలా మంది చరిత్ర నుంచి ప్రభావితమవుతారు. కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. అలాంటి వారిలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకరు. తెలంగాణ సమాజాన్ని ఊగించి, ఉరికించి, శాసించి విజయతీరాలకు చేర్చారు. ఆయన ఉక్కు సంకల్పం, వ్యూహ చతురత ముందు ఆ విధి సైతం తలవంచింది. తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా అవతరించింది. సబ్బండ వర్గాలందరికీ గులాబీ జెండా నీడైంది. నేడు (ఏప్రిల్ 27) తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్‌ఎస్) 20వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజకీయ ప్రస్థానం గురించి సంక్షిప్తంగా..

టీఆర్‌ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవడమంటే.. కేసీఆర్ జీవిత చరిత్ర గురించి చెప్పుకోవడమే. గులాబీ జెండాను, కేసీఆర్‌ను వేరు చేసి చూడలేం. తెలంగాణలో 1969 వరకూ ఒక చరిత్ర. ఆ తర్వాత ఒక చరిత్ర. ఆంధ్ర వలసవాదం సుడిగాలిలో తెలంగాణ అస్తిత్వ స్పృహ ఆరిపోకుండా ఉండటానికి ఎందరో నాయకులు కృషి చేశారు. 1969 ఉద్యమం అణగారిపోయిన తర్వాత ఆ ఆశలు సన్నగిల్లాయి. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు ఉద్భవించగలడా అని జనం ఆశగా ఎదురు చూశారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. గులాబీ జెండాను చేత పూని కేసీఆర్ బయల్దేరారు. చినుకుగా మొదలైన ఆ ఉద్యమ ప్రస్థానం అనతి కాలంలోనే తుఫాన్‌గా మారింది. రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది.

సరిగ్గా రెండు దశాబ్దాల కిందట 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ జాతిని విముక్తం చేయడానికి కేసీఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ గల భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర సమితిది ప్రత్యేక చరిత్ర. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌.. డిప్యూటీ స్పీకర్‌ పదవికి 2001 ఏప్రిల్‌ 21న రాజీనామా చేశారు. వారం రోజుల్లోనే పార్టీ ప్రకటించారు.

పదవీ త్యాగపునాది మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతో టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుందని బలంగా నమ్మిన కేసీఆర్.. అదే విజన్‌తో 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 2001 మే 17న తెలంగాణ ‘సింహగర్జన’ భారీ బహిరంగ సభలోనే కేసీఆర్‌ రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణ సాధిస్తామని ప్రకటించారు. ఇక నాటి నుంచి రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు మొదలయ్యాయి.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌‌తో పొత్తు, నాటి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో కరీంనగర్‌లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రకటింపజేయడం, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం ఒక మైలురాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరిన తర్వాత దేశంలోని 35 పార్టీల అభిప్రాయాలను తెలంగాణకు అనుకూలంగా తీసుకురావడం లాంటివన్నీ తెలంగాణ సాధనకు మార్గం సుగమం చేసిన ఎత్తుగడలుగా విశ్లేషకులు అభివర్ణిస్తారు.

‘కేసీఆర్‌ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ తేలిపోవాలని 2009 నవంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యమ చరిత్రలో ఇది కీలక మలుపు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చింది. 2009 డిసెంబర్‌ 9న నాటి హోం మంత్రి చిదంబరం.. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కానీ, కేసీఆర్‌ దీక్ష విరమించిన తర్వాత కొద్ది గంటల్లోనే యూపీఏ యూ-టర్న్‌ తీసుకుంది. దీంతో తెలంగాణలో ఉద్యమం మరింత ఉధృతమైంది. త్యాగాల కొలిమిగా తెలంగాణ మారింది.

తెలంగాణ ఏర్పాటు బిల్లు లోక్‌సభలో ఫిబ్రవరి 18న, రాజ్యసభలో ఫిబ్రవరి 20న ఆమోదం పొందింది. రాష్ట్రపతి మార్చి 1న తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపారు. గెజిట్‌లో 2014 జూన్‌ 2 ‘అపాయింటెడ్‌ డే’ గా పేర్కొన్నారు. దీంతో జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిన 2001 ఏప్రిల్‌ 27 నుంచి ప్రారంభమైన తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా టీఆర్‌ఎస్‌ చరిత్రే.