డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలే తప్ప అడుక్కుతినే బతుకు వద్దంటూ రైతులను ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, రైతును రహదారులపైకి లాగిన మీరా రైతుల గురించి మాట్లాడేదని మండిపడ్డారు. రైతుభరోసాకు ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో కనికట్టు చేసిన మీరా రైతుల గురించి మాట్లాడేదంటూ ధ్వజమెత్తారు. రైతులు ఎప్పుడూ ఆశపడతారు తప్ప అడుక్కోరని చెప్పారు. వారికి సమయం రాకపోదని, మీకు తగిన గుణపాతం చెప్పకపోరంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు.
రైతే రాజు నినాదం కాదు కేసీఆర్ ప్రభుత్వ విధానం. అడగకుండానే రైతుబంధు అడగకుండానే రైతుబీమా అడగకుండానే సాగునీళ్లు అడగకుండానే ఉచితంగా 24 గంటల కరంటు అడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనతో వ్యవసాయ రంగం వెన్నువిరిగి, బతుకుదెరువు కోసం వలసబాట పట్టిన అన్నదాతలలో ఆత్మవిశ్వాసం నింపి వ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కరోనా విపత్తులోనూ కర్షకులకు బాసటగా నిలిచిన చరిత్ర కేసీఆర్ గారిది. ప్రతి ఊరికీ వెళ్లి పంటలు కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ గారిది.