రాగల మూడు నాలుగు రోజులలో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు దక్షిణ బంగాళాఖాతం లోని మరిన్ని ప్రాంతాలు, పూర్తి అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో పాటు రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
ఇప్పటికే తెలంగాణ లోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. మంచిర్యాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది దీంతో వాతావరణ శాఖ అధికారులు 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.