కేసీఆర్ దృఢమైన నాయకత్వం, రాజకీయ దూరదృష్టి వల్లే తెలంగాణ ఆవిర్భవించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సం అంటే పోరాటాలు, త్యాగాలతో కూడుకున్న చరిత్ర అని ఇటువంటి చరిత్రలో భాగమైన జాగృతి కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారని అటువంటి తల్లులకు ఉద్యమాభివందనాలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని నూతనంగా ప్రారంభించిన తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఇవాళ ఆమె జాతీయ జెండాతో పాటు, జాగృతి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత తెలంగాణ నూతన జాగృతి కార్యాలయంలో తొలిసారిగా జెండాలను ఎగురవేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండటం దారుణం అని ఇది తెలంగాణ ప్రజల దురదృష్టకరం అన్నారు. ముఖ్యమంత్రి తీరును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇది అమరవీరులకు జరుగుతున్న అన్యాయంగానే భావిస్తామన్నారు. అమరవీరులకు సీఎం నివాళులు అర్పించే వరకు జాగృతి తరఫున ప్రత్యేక కార్యాచరణ తీసుకుని పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర వనరుల మీద జరుగుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగడుతామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కవిత కీలక వ్యాఖ్యలు..
