తనను అరెస్ట్ చేయించడమే మంత్రి కొల్లు రవీంద్ర లక్ష్యం అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మోకా భాస్కర రావు మర్డర్ కేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్ కావడంతో తనపై కక్ష కట్టారని విమర్శించారు. నకిలీ పట్టాల కేసులో తనను అరెస్ట్చేయాలని చూస్తున్నారని చెప్పారు. ఎన్నికల ముందే తాను నఖిల పట్టాలు పంచుతున్నానని ప్రచారం చేశారని మరి అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయించలేదని అన్నారు. ప్రతి పట్టా తన చేతుల మీదుగానే పంచిపెట్టానని చెప్పారు. తనతో ఎమ్మెల్యే కూడా ఉన్నారని తెలిపారు.
పోలీస్ గ్రౌండ్ లో కూడా లబ్దిదారులకు పట్టాలు పంచిపెట్టానని తెలిపారు. రాని వాళ్లకు పట్టాలను తమ ఇంటికే పంపించామని తెలిపారు. ఇది 2021 ఏప్రిల్ లో జరిగిందని అన్నారు. సీఎం జగన్ పంచిన పట్టాలకు 10 సంవత్సరాలు నిండిన తరవాత సొంత ఆస్తి అవుతుందని చెప్పారన్నారు. ఎన్నికల సమయంలో అధికారులు రిజిస్ట్రేషన్ చేశారని దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ చేసినా కోర్టులు ఉన్నాయని కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని పేర్నినాని చెప్పారు. ఏడాది కాలంగా తనను వేధించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.