రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహానికి వినపత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయనందుకు నిరసనగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అలవి కానీ హామీలతో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. తీరా గెలిచాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. తులం బంగారం, నాలుగు వేల పెన్షన్, రైతు భరోసా రూ.15 వేలు ఇలా అనేక హామీలను విస్మరించిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజల తరఫున పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా పేదల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.