ఎస్సీ వర్గీకరణ పై ఈ రోజు ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ తన నివేదికను సచివాలయంలోని నీటి పారుదల శాఖ మంత్రి ఛాంబర్ లో సబ్ కమిటీకి అందజేయనుంది.ఈ సందర్భంగా ఏకసభ్య కమిషన్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ నివేదిక పై సబ్ కమిటీ చైర్మన్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశమై చర్చించి రాష్ట్ర కేబినెట్ కు సిఫారసు చేయనుంది. కాగా ఎస్సీ వర్గీకరణ పై సుదీర్ఘంగా కొనసాగిన విచారణ అనంతరం ఆగస్టు1, 2024న సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
దీంతో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్గీకరణపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. సబ్ కమిటీ సమావేశమై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించింది. కాగా జస్టిస్ షమీం అక్తర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి ఎస్సీ వర్గీకరణపై నివేదికను సిద్ధం చేశారు. అధ్యయనం ముగియడంతో ఫైనల్ రిపోర్టును కమిషన్ సోమవారం సబ్ కమిటీకి అందజేయనుంది. అనంతరం ఎస్సీ వర్గీకరణ నివేదికను మంగళవారం నాడు జరిగే కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించడానికి సిద్ధపడింది.