ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హై సిటీ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ. 3667 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 3500 కోట్లతో ఫ్లై ఓవర్లు, రహదారుల పనులకు శంకుస్థాపన చేయగా పలు జంక్షన్ లో కోటి 50 లక్షల బ్యూటిఫికేషన్ పనులకు ప్రారంభోత్సవం చేయబోతున్నారు.
కాగా, 16 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రైన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ లో పూర్తైన వాటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించబోయే ఆరు ఫ్లైఓవర్లు, అండర్ పాసులకు శంకుస్థాపన చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హై సిటి ప్రాజెక్టు పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అన్నింటినీ కలిపి ఐమాక్స్ పక్కన హెచ్ఎండీఏ గ్రౌండ్లో వర్చువల్ గా నేటి మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.