మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ ను ఆఫీస్ బాయ్ ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తాజాగా నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఆవేదన వ్యక్తం చేసింది. కన్నప్ప మూవీపై కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేసింది. ఉదయం నుంచి వస్తున్న వార్తలన్నింటికీ క్లారిటీ ఇచ్చింది నిర్మాణ సంస్థ. ‘ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి మాకు హార్డ్ డిస్క్ ను కొరియర్ లో పంపించారు. అది మా దాకా రాకముందే చోరీకి గురైంది. ఆ హార్డ్ డిస్క్ ను చరిత అనే మహిళ చెప్పడంతో రఘు అనే వ్యక్తి తీసుకున్నాడు.
కానీ అది మాకు ఇవ్వకుండా పారిపోయారు. ఆ హార్డ్ డిస్క్ లో రెండు కీలక పాత్రలకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్, వీఎఫ్ ఎక్స్ విజువల్స్ ఉన్నాయి. అది మా సినిమాకు చాలా కీలకం. ఆ ఇద్దరూ మా సంస్థకు చెందిన ఉద్యోగులు కాదు. వారితో అసలు మాకు సంబంధమే లేదు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ ఇలాంటి ఘటన జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మా సినిమాపై కుట్ర జరుగుతోందని అర్థం అవుతోంది. కానీ ఎవరు చేశారన్నది తెలియాలి. మా సినిమాకు సంబంధించిన 90 నిముషాల ఫుటేజ్ ను ఆన్ లైన్ లో లీక్ చేయాలని కుట్ర చేశారు. ఇది అత్యంత నీచమైన పని. పిరికిపందలే ఇలా చేస్తారు. వ్యక్తిగత కక్ష సాధింపుల కోసమే ఇలా చేశారు’ అని నిర్మాణ సంస్థ చెప్పుకొచ్చింది. ఇంకోవైపు కన్నప్ప టీమ్ ఈ విషయంపై చాలా సీరియస్ గానే చర్యలకు దిగింది.