తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్టాపిక్గా మారింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా పత్రికల్లో వచ్చిన లేఖ. ఈ లేఖపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? నిజంగా కవిత ఈ లేఖ రాశారా? లేదా ఆమె పేరుతో వేరే ఎవరైనా విడుదల చేశారా? అనే అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు. ఈ లేఖ విడుదల వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందని డీకే అరుణ ఆరోపిస్తున్నారు. ఇది కేవలం కుటుంబ భావోద్వేగాల వ్యక్తీకరణ మాత్రమే కాదని, దీని వెనుక కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. కవిత లేఖను కాంగ్రెస్ పార్టీనే విడుదల చేసిందా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టకపోవడం ద్వారా కాంగ్రెస్కు మద్దతు తెలపాలన్న ఆలోచనగా ఇది కనిపిస్తోందని ఆరోపించారు.
కవిత లేఖ ద్వారా బీజేపీని టార్గెట్ చేస్తే ప్రజల మద్దతు వస్తుందని కొన్ని పార్టీలు భావిస్తున్నాయని డీకే అరుణ అన్నారు. కానీ ప్రజల్లో బీజేపీపై పెరుగుతున్న విశ్వాసాన్ని ఎవరూ తగ్గించలేరని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ గెలుస్తుంది అనే భావన ప్రజల్లో పెరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ విఫలమైన పార్టీలు. ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా బీజేపీనే చూస్తున్నారు అని ఆమె చెప్పారు. బీఆర్ఎస్తో బీజేపీ కలవడమనే అవకాశమే లేదు. గతంలో మీరు చేసిన కుట్రలు ప్రజలు మర్చిపోలేదు. అయినా బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఆపలేరు అంటూ డీకే అరుణ కుండబద్దలుగొట్టిన వ్యాఖ్యలు చేశారు.