టాలీవుడ్ ప్రముఖ నటుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గద్దర్ అవార్డులను ప్రకటించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏపీలోనూ ఇలాంటి అవార్డులు ప్రకటించాలని నారాయణమూర్తి కోరారు. అలాగే ఇటీవల ఏపీలో చర్చనీయాంశమైన థియేటర్ల బంద్ వ్యవహారంపై కూడా పీపుల్స్ స్టార్ స్పందించారు. ‘గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వంగా ఉంది. అలాగే అవార్డుల విజేతలకు నా అభినందనలు. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా నంది అవార్డులను ప్రకటించాలి. ఈ మధ్యన థియేటర్ల పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పర్సంటేజిలు ఖరారైతే నా లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. పవన్ కళ్యాణ్ పై ఎవరు కుట్ర చేస్తారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసంగా లేదు. హరిహర వీరమల్లు కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్ పై గౌరవం మరింత పెరిగేది. థియేటర్ల బంద్ అనేది బ్రహ్మాస్తం. సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైంది’
‘భారతదేశంలో సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి దొరికే విధానం. పర్సంటేజి విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక్కణ్ణి. పర్సంటేజిల విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాం. ఎంతో మంది ఛాంబర్ ప్రెసిడెంట్ లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజిల విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సరికాదు. పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలువాలని అనడంలో తప్పులేదు. మేం మీ బిడ్డలం. పర్సంటేజి విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టమ్ లకు వంతపాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి? సింగిల్ థియేటర్లు దేవాలయాల లాంటివి. ఇప్పుడు సింగిల్ థియేటర్లు కళ్యాణ మండపాలవుతున్నాయి. పర్సంటేజిని బతికించి నిర్మాతలను కాపాడాలి. ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూస్తే ఇండస్ట్రీ నాశనమవుతుంది’ అని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.