పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. గత శుక్రవారమే ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 60 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టమే అమల్లో ఉంది. దీని స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేసింది.
ఇందులో భాగంగానే శనివారం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ త్వరలో పార్లమెంట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఆమె తెలిపారు. బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాక మరింత పరిశీలన కోసం హౌస్ ప్యానెల్కు పంపిస్తారు. ప్రస్తుత పన్ను చట్టాలను సరళీకృతం చేయడమే కొత్త బిల్లు లక్ష్యం అని స్పష్టం చేశారు. కొత్త సెస్సును మాత్రం ప్రవేశపెట్టబోమని పేర్కొన్నారు. అయితే కొత్త బిల్లులో అనేక సవరణలు ఉంటాయని ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు.