మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వమైతే కొలువుతీరింది. ఇక కీలకమైన మంత్రి పదవుల పంపకాల వ్యవహారం మిగిలింది. బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే -శివసేనల మధ్య కీలకమైన నాలుగైదు మంత్రి పదవుల పంపకాలపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. హోంశాఖ, రెవెన్యూశాఖలను తమ వద్దే ఉంచుకుంటామని బీజేపీ తేల్చి చెప్పింది. అర్బన్ డెవలప్మెంట్ శాఖను డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు, ఆర్థికశాఖను డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు కేటాయించారు. మిగిలిన శాఖల పంపకాలపై తేల్చుకునేందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కలిసి ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలతో వారు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సెపరేటుగా ఏక్నాథ్ షిండే కూడా వెళ్తారనే టాక్ మహారాష్ట్ర మీడియాలో వినిపిస్తోంది.