టికెట్ ధరలపై పెంపుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన పవన్ డిమాండ్, సప్లై ఆధారంగానే టికెట్ ధరల పెంపు ఉంటుందన్నారు. టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదని, ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తోందని తెలిపారు. అయితే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపును సీపీఐ నేత రామకృష్ణ తప్పుబట్టారు. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటిస్తే ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. పంటల గిట్టుబాటు ధరల గురించి పట్టించుకోని పవన్ కల్యాణ్ నిర్మాతలు, సినీ హీరోలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఏంటని తీవ్రంగా విమర్శించారు. మొత్తానికి బెనిఫిట్ షోల వ్యవహారం ఏపీలో కొత్త చర్చకు దారి తీస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీ కూడా వ్యవహరించాలని కొందరు డిమాండ్ చేస్తుంటే పవన్ కల్యాణ్ మాటలతో దీనిపై ఏపీ ప్రభుత్వం దాదాపుగా ఓ క్లారిటీ ఇచ్చినట్టే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.