క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. హరీష్ రావు పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
అంతేగాక హరీష్ రావును అరెస్ట్ చేయోద్దని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ కేసులో సాక్షులు, ఫిర్యాదుదారుని వాంగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు ఇప్పటికే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. మంత్రిగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసు విచారణ శుక్రవారం హైకోర్టు బెంచ్ ముందుకు రానుంది. దీంతో హరీష్ రావు క్వాష్ పిటీషన్ పై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ విచారణను ఎదుర్కొంటుండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పిటిషన్ ను కోర్టు కొట్టేస్తుందా? లేదా? అనేది సంచలనంగా మారింది.