సిద్దిపేటలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల కోసం ప్రజలు ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టాలని ప్రశ్నించారు. దరఖాస్తు పెట్టినప్పుడల్లా 40 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, గతంలో ఇచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయకుండా మూలకు పడేశారని, దరఖాస్తుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. అదేవిధంగా, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తమ మోసం విధానాలను ప్రకటించిందని అన్నారు రుణమాఫీ అయిపోయిందని సీఎం రేవంత్ హైదరాబాద్ లో మాట్లాడుతున్నారని కానీ, ప్రజాపాలనలో రుణమాఫీ కాలేదని, దరఖాస్తులు వస్తున్నాయని హరీష్ రావు అన్నారు.