విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని నేను గట్టిగా నమ్ముతాను అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు జగన్. ఈ సమావేశానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, శిల్పా రవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సహా పలువురు నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. వైసీపీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడింది. కేవలం ఇచ్చిన మాటకోసం ఎందాకైనా వెళ్లాం ఆ ప్రస్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. బలమైన పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. ఆరోజు నుంచి నాతోనే మీరంతా అడుగులు వేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ నాతోనే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. విలువలకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయి. గట్టిగా ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నాలో ఈరెండింటిని చూసి నాతోపాటుగా అడుగులో అడుగు వేశారని గుర్తుచేసుకున్నారు.