చేయి విరిగిందని ఆస్పత్రికొస్తే..

vizag-15-.jpg

విశాఖపట్నం జిల్లా తగరపువలస సమీపంలోని జీరుపేట గ్రామంలో నివాసముంటున్న ఎర్రంశెట్టి రేవతి (22) అనే మహిళ స్వస్థలం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని కొవ్వూరు గ్రామం. ఆమె భర్త జనార్దన్‌ చిప్పాడ దివీస్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి నాలుగేళ్లు, తొమ్మిది నెలల కుమారులు ఉన్నారు. రేవతి మే 6న ఇంట్లోని బాత్‌రూంలో జారి కింద పడిపోయింది. దీంతో ఆమె కుడిచేయి విరిగింది. వెంటనే సంగివలస ఎన్నారై ఆసుపత్రిలో బంధువులు ఆమెను చేర్పించారు. ఆపరేషన్‌ చేయాలని వైద్యులు చెప్పడంతో అందుకు అవసరమైన బీమా సదుపాయం ఉన్నట్లు తెలిపారు. అయితే వాటికి సంబంధించిన అనుమతులు వచ్చాకే ఆపరేషన్‌ చేస్తామని వైద్యులు చెప్పారు. మే 8వ తేదీ సాయంత్రానికి అనుమతులు వచ్చాయి. దీంతో మే 9వ తేదీన ఉదయం శస్త్రచికిత్సకు చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. నొప్పి తెలియకుండా ఉండేందుకు మత్తు ఇవ్వగా ఆ డోసు కాస్త ఎక్కువై ఆమె కోమాలోకి వెళ్లింది.

పరిస్థితి విషమంగా మారడంతో ఆమె భర్త జనార్దన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైద్యులు ఆయనకు నచ్చజెప్పి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రి వర్గాలే ఆదే నగరంలోని మరో ఆస్పత్రికి మే 10న తరలించారు. అయితే అక్కడ కూడా రేవతి పరిస్థితి మెరుగుపడలేదు. ఆమె ఆరోగ్యం రోజురోజుకీ విషమించడంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే రేవతి మృతి చెందిందంటూ తమకు న్యాయం జరిగే వరకూ పోస్టుమార్టంకు సహకరించేది లేదని మృతురాలి కుటుంబీకులు ఆస్పత్రి ఎందుట నిరసనకు దిగారు. అనంతరం ఎన్నారై ఆసుపత్రి వద్దకు చేరుకుని బుధవారం రాత్రి ఆందోళన చేపట్టారు. రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలంటూ డిమాండ్‌ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని సర్ధిచెప్పేయత్నం చేశారు.

Share this post

scroll to top