కారు, లారీ ఢికొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం అతివేగంగా వచ్చిన ఓ లారీ, కారు కొంతమూరు వద్ద ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కున్న మృతదేమాలను బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ సహా ఐదు మంది ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. కాగా మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఘటనా స్థలాని పరిశీలించిన పోలీసులు లారీనే కారును ఢీకొట్టి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రమాదానికి గురై రోడ్డుకు అడ్డంగా ఉన్న రెండు వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించిన పోలీసులు అక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కాగా ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.